నేడే నోటిఫికేషన్
నేటి నుంచి 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
కేటగిరీల వారీగా రిజర్వేషన్
విధివిధానాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం
స్థానికులకే అవకాశం.. దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్సైట్
పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో టెన్త్ అర్హత
18–35 మధ్య వయస్సు వారే అర్హులు
ఎంపికకు మండల, పట్టణ స్థాయిలో అధికారుల కమిటీలు
11 నుంచి ఇంటర్వూ్యలు.. ఆగస్టు 1న ఎంపికైన వారి జాబితా వెల్లడి
ఆగస్టు 5–10 తేదీల మధ్య శిక్షణ.. అదే నెల 15 నుంచి విధుల్లోకి
గ్రామ– వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. వలంటీర్ల ఎంపికకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించిన విషయం విదితమే. వీరి ఎంపికకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాల ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేస్తోంది. అందులోని నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లో పేర్కొంటారు. జూలై ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామం, పట్టణ వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక జరుగుతుంది.